అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తిరిగి ప్రారంభం అయింది. ఈరోజు జరిగిన అసోసియేషన్ సభ్యుల అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లోని కొంతమంది సభ్యుల ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ పోకడలు వ్యతిరేకిస్తూ ఆ అసోసియేషన్ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ఈ క్రమంలోనే అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ పాత్రికేయులు సతీష్ ముదిరాజ్, మహమ్మద్ గౌస్, శేఖర్, డిఎస్. హంసరాజ్ నాథ్, చింత బాలస్వామి అలియాస్ స్వామి, నూనె సతీష్ యాదవ్, కళ్యాణ్ బాబులు అంబర్ పేట కాన్స్టిట్యుయన్సీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లో చేరారు. వారిని అంబర్ పేట కాన్స్టిట్యుయన్సీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు వర్కాల కృష్ణ, సీతారాంలు యూనియన్ లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వర్కాల కృష్ణ మాట్లాడుతూ పాత మిత్రులు తిరిగి సొంత గూటిలోకి రావడం సంతోషం కలిగించిందన్నారు. అందరి సహకారంతో రానున్న రోజుల్లో అసోసియేషన్ ను మరింతగా బలోపేతం చేసే దిశగా పని చేస్తామని తెలిపారు. మరి కొంతమంది సభ్యులు కూడా తమ అసోసియేషన్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అసోసియేషన్ వారందరి కోసం ద్వారాలు తెరిచి ఉంచుతుందని పేర్కొన్నారు.