ఢిల్లీ పోలీసులకు సవాల్ గా మారిన శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే మరో మర్డర్ జరిగింది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా అనుమానంతో ఒక మహిళను ప్రశ్నించడంతో ఈ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. శ్రద్ధావాకర్ ను ఆఫ్తాబ్ అనే వాడు హత్య చేసి శరీరాన్ని 35 భాగాలు చేసి ఫ్రిజ్ లో పెట్టగా ఈ కేసులో ఆ మహిళ తన భర్తను హత్య చేసి 22 భాగాలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టింది.
తూర్పు ఢిల్లీలోని త్రిలోక్పురి, పాండవ్ నగర్లలో లభించిన మానవ శరీర భాగాల కేసును పోలీసులు ఛేదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లయింది. హత్యకు గురైన వ్యక్తి పేరు అంజన్ దాస్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంజన్ భార్య, ఆమెకు వేరే వ్యక్తితో పుట్టిన ఆమె కొడుకు మద్యంలో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితికి తీసుకొచ్చి అతడిని హత్య చేశారు.
పూనమ్ అనే మహిళ ఢిల్లీకి చెందిన కల్లును వివాహం చేసుకుంది. కల్లు, పూనమ్లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాలేయ వైఫల్యంతో కల్లు మరణించిన తరువాత, పూనమ్ అంజన్ దాస్తో కలిసి జీవించడం ప్రారంభించింది. అంజన్ దాస్కు బీహార్లో కుటుంబం ఉంది. అతడికి 8 మంది పిల్లలు ఉన్నారు. అంజన్ దాస్ లిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం చేసేవాడు. పూనమ్ కొడుకు దీపక్ కు ఇటీవల వివాహం అయింది. కొత్త కోడలిపై అంజన్ దాస్ కన్ను వేశాడు. దాంతో అతడిని హత్య చేయాలని తల్లి కొడుకు కలిసి ప్లాన్ చేశారు.
మే 30న పూనమ్, ఆమె కుమారుడు దీపక్ అంజన్దాస్కు మద్యం తాగించి అందులో నిద్రమాత్రలు కలిపారు. ఆ తర్వాత అతని గొంతు కోసి, రక్తం పూర్తిగా పోయేలా మృతదేహాన్ని ఒకరోజు ఇంట్లోనే వదిలేశారు. అప్పుడు వారు మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టారు. ఇప్పుడు అందులోని 6 ముక్కలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రక్తాన్ని శుద్ధి చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి పాలిథిన్లో వేసి తలను గోతిలో పూడ్చిపెట్టారు.
జూన్ 5న పాండవ్ నగర్లోని రాంలీలా మైదాన్లో మృతదేహంలోని కొన్ని భాగాలు లభ్యమయ్యాయి. ఈ దారుణ హత్యకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి డోర్ టు డోర్ విచారణ జరిపి మృతుడిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో పూనమ్, ఆమె కుమారుడు దీపక్ కనిపించారు. అంజన్ దాస్ 5-6 నెలలుగా తప్పిపోయాడు. అయితే అతని కుటుంబం ఎటువంటి మిస్సింగ్ రిపోర్టును పోలీస్ స్టేషన్ లో నమోదు చేయలేదు.
విచారణ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడి మొబైల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఇద్దరూ హత్యను ఖండించారు. అయితే సీసీటీవీలో కనిపించిన దుస్తులను పోలీసుల బృందం గుర్తించింది. అనంతరం తల్లీకొడుకులు తమ నేరాన్ని అంగీకరించారు.