కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించి ప్రత్యక్షంగా నరకం చూపిస్తున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు కేంద్ర బడ్జెట్ గుదిబండగా మారిందని ఆయన అన్నారు. సెంచురీకి చేరువలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసర వస్తువుల పై ప్రభావం చూపిస్తున్నదని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు “దింపుడు కళ్లెం ఆశ”గా మారాయని, ప్రత్యేక హోదా “అందని ద్రాక్ష”గా మారిందని ఆయన అన్నారు.
రైల్వే జోన్ ప్రకటన “నీళ్ళ మాటలు”గా మారిందని ఆయన అన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి “చిల్లిగవ్వ” లేదు, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ విమానాల ఊసేలేదు ఇదేం బడ్జెట్ అని ఆయన ప్రశ్నించారు.
బడ్జెట్ పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలని ఆయన అన్నారు. ఎంపీలు పార్లమెంటును స్తంభింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు.