శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కళాశాల అధ్యాపకుడు బలివాడ సతీష్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించారని తెలిపారు.
మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు.
ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు.
చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడని ఆయన తెలిపారు.
ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు.
తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు.
చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశారని ఆయన తెలిపారు.
అందుకే నేడు ముఖ్యమైనదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు,
పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.