కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఆంధ్రా ప్రజలు పెద్ద సంఖ్యలో బయలుదేరడంతో సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో మొదలైన ఆందోళన మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో తారాస్థాయికి చేరింది.
మళ్లీ లాక్ డౌన్ విధిస్తే ఎన్నో రకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందనే ఆందోళనతో వేలాది మంది ఆంధ్రాకు తరలిపోతున్నారు. దాంతో గరికపాడు తదితర చెక్ పోస్టుల వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సాయంత్రం 7 గంటల వరకే అనుమతి ఉండటంతో… బోర్డర్ వద్ద అధికారులు వాహనాలను నిలిపి వేస్తున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొటున్నారు.
వైద్య పరీక్షల పేరుతో ఆంధ్రా పోలీసులు తమను నిలిపివేస్తున్నారని ఇది అన్యాయమని వారు అంటున్నారు. పాస్ తీసుకుని వెళ్లే వారిని కూడా ఆపుతున్నారని, వైద్య పరీక్షలు చేస్తున్నారన వారు అంటున్నారు. వైద్య పరీక్షలు చేసే విధానం ఉంటే పాస్ లు ఎందుకు అడుగుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. పాస్ తీసుకోవడానికి, వైద్య పరీక్షలకు ఎంతో సమయం వృధా అవుతున్నదని వారు వాపోతున్నారు.