మరో నెలరోజుల్లో భారీ క్రీడా సంబరం ప్రారంభం కానుంది. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు స్థాయిల్లో జరిగే ఈ పోటీల్లో వందలాది మంది క్రీడాకారులు పాల్గొనేందుకు రంగం సిద్దమయ్యింది. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఉద్దేశించిన ఈ పోటీల్లో విజేతలకు స్పోర్ట్స్ కిట్లు, మెమెంటోలు, నగదు బహుమతులు ఇవ్వనున్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటెన్, ఖోఖో, కబడ్డీ క్రీడాంశాల్లో డిసెంబరు 15 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 20 నుంచి ఆడుదాం ఆంధ్రా రిజిష్ట్రేషన్లు…!
“ఆడుదాం ఆంధ్రా” క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 20 నుంచి సచివాలయాల్లో ఉచితంగా తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవాలని ఈ మేరకు విజయనగరం జిల్లా సెట్విజ్ సిఇఓ రాంగోపాల్ తెలిపారు. స్థానిక క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్రా వివరాలను వెళ్లడించారు. డిసెంబరు 15 నుంచి “ఆడుదాం ఆంధ్రా” క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని చెప్పారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటెన్, ఖోఖో, కబడ్డీ క్రీడాంశాల్లో ఈ పోటీలు జరుగతాయన్నారు. డిసెంబరు 15 నుంచి 20 వరకు సచివాలయ స్థాయిలో, 21 నుంచి జనవరి 4 వరకు మండల స్థాయిలో, జనవరి 5 నుంచి10 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 11 నుంచి 21 వరకు జిల్లా స్థాయిలో, జనవరి 22 నుంచి25 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయని వివరించారు.
పోటీల విజేతలకు గణతంత్ర దినోత్సవం జనవరి 26న బహుమతి ప్రధానం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి ఉండి 15 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని సూచించారు. ఈ నెల 20 నుంచి డిసెంబరు 10 వరకు తమ సచివాలయంలోనే పేర్లు ఉచితంగా రిజిష్టర్ చేసుకోవాలని చెప్పారు. ప్రతి సచివాలయం పరిధిలో క్రీడా మైదానాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందని, క్రీడా సామగ్రి అంతా ప్రభుత్వమే సరఫరా చేస్తుందని తెలిపారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు నగదు బహుమతి కూడా ఉంటుందని చెప్పారు. క్రీడాకారులకు మైదానం వద్దే భోజన సదుపాయాన్ని కల్పిస్తామని, త్రాగునీరు, ప్రధమ చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జట్ల మధ్య పోటీలు, స్కోర్ బోర్డు ఆన్ లైన్ ద్వారా కూడా ప్రదర్శిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా ఛీఫ్ కోచ్ అచ్యుతరావు, డి.ఐ. పి.అర్. ఓ. డి.రమేష్, ఇతర కోచ్లు పాల్గొన్నారు.