కొత్తగూడెం, ఇల్లందు మండలాల్లో సింగరేణి సంస్థ ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూముల్లో ఇళ్ళు, వ్యాపార సముదాయాలు నిర్మించుకున్న ప్రజలు క్రమబద్ధీకరణ పట్టాల కొరకు మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జూన్ 2, 2020 సంవత్సరం లోపు ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకున్న ప్రజలు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని చెప్పారు. గతంలో క్రమబద్ధీకరణకు తిరస్కరణకు గురైన వారు సైతం తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి సమయం ఉందని చెప్పారు. కొత్తగూడెం, ఇల్లందు పట్టణాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. అలాగే ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల ఇళ్ళు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జిఓ 58, 59 ద్వారా క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. ఈ నెలాకరు వరకు దరఖాస్తు చేయుటకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. 125 గజాల లోపు స్థలం ఉన్న లబ్ధిదారులకు జిఓ 58 ప్రకారం ఉచిత మని, 125 కంటే ఎక్కువ స్థలం ఉంటే నామ మాత్రపు రుసుముతో క్రమబద్ధీకరణ చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తుతో పాటు ఇంటి పన్ను, కరెంట్ బిల్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ ఫోటో, ప్రాపర్టీ ఫోటో, మొబైల్ నంబర్, ప్రాపర్టీ హద్దుల జిరాక్స్ ప్రతులతో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
previous post