రిపబ్లిక్ టివి వ్యవస్థాపకుడు, ప్రముఖ మోడరేటర్ అర్నబ్ గోస్వామి పై దాడి జరిగింది. యూత్ కాంగ్రెస్ కు చెందిన గూడాలు తనపై దాడి చేసినట్లు అర్నబ్ గోస్వామి వెల్లడించారు. అర్నబ్ గోస్వామి నిన్న ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.
మహారాష్ట్రంలో ఇద్దరు సాదువులను ఒక డ్రైవర్ ను అక్కడి స్థానికులు అతి కిరాతకంగా కొట్టి చంపిన సంఘటనపై సోనియాగాంధీ ఇప్పటి వరకూ మాట్లాడకపోవడాన్ని అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. భారత దేశంలో హిందువుగా పుట్టడమే పాపమా అని ఆ కార్యక్రమంలో అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు.
కాషాయంధరించడం నేరమా అని ఆయన అన్నారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీ తన పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో హిందువులను ప్రజలు కొట్టి చంపినందుకు ఎంతో సంతోషించి ఉంటారని, ఈ మేరకు ఇటలీకి రిపోర్టు పంపి ఉంటారని అర్నబ్ గోస్వామి అన్నారు.
ఈ వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అర్నబ్ గోస్వామి తన పరిధిని దాటి వ్యాఖ్యానించారని తీవ్రంగా మండిపడ్డారు. ముంబయిలో తన స్టూడియో నుంచి తిరిగి వెళుతుండగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కారుపై దాడి చేశారు. అప్పుడు ఆ సమయంలో ఆయనతో బాటు ఆయన భార్య కూడా కారులో ఉన్నారు. కారు అద్దాలు పగలగొట్టేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.
యాసిడ్ పోసేందుకు ప్రయత్నించారు. ఎలాగోలా తప్పించుకుని అర్నబ్ గోస్వామి ఇంటికి చేరారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసిన యూత్ కాంగ్రెస్ వర్కర్లను అదుపు చేశారు. దాడి అనంతరం అర్నబ్ గోస్వామి మాట్లాడుతూ సోనియాగాంధీ గురించి తాను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. తనకు ఎలాంటి హాని జరిగినా సోనియాగాంధీ, ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రాదే బాధ్యత అని అన్నారు.