టీఎస్పీఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీతో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్టిపి కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి నీలం రమేష్ అన్నారు. పేపర్ లీకేజీ ఘటనలో టీఎస్పీఎస్సిని వెంటనే ప్రక్షాళన చేయాలని కోరుతూ వైఎస్ఆర్టిపి ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి నీలం రమేష్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్ తో తెచ్చుకున్న తెలంగాణ లీకేజీల మయం అయిందన్నారు. తెలంగాణ సాధించుకున్నాక నిరుద్యోగ సమస్యపై ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులదే కీలక పాత్ర అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. టీఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టిపి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్, నాయకులు జమునారథోడ్, వెంకట్, సంగమేశ్వర్, ఇతర నాయకులు ఉన్నారు.
next post