మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు, కోవిడ్-19, వెట్టిచాకిరీ వంటి పలు సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకురావడానికి ఖమ్మం జాగృతి కళాజాత బృందం చేస్తున్న కృషి అభినందనీయమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
ఇటీవల ఖమ్మం అర్బన్ మండలం అల్లిపురం ,రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిమ్మపూడి వైరా మండలం గొల్లపూడి ,కల్లూరు మండలం ఓబుల్ రావు బంజారా, నేలకొండపల్లి మండలం రాజేశ్వరం పురం గ్రామాల్లో కళాజాత బృందాలు ఇచ్చిన అద్భుత ప్రదర్శనలతో గ్రామస్తులను చైతన్య పరిచారని అన్నారు.
సమాజంలోని వివిధ సామాజిక రుగ్మతలపై కళాబృందాలు చేస్తున్న ప్రదర్శనలు ప్రజలపై విశేష ప్రభావం చూపేవన్నారు. యువతను మేల్కొలుపుతూ పోలీస్ కళాకారుల ప్రదర్శనలు విద్యార్థులతో పాటు పెద్దలనూ విశేషంగా ఆకట్టుకుంటూ.. సమాజాన్ని అనేక సమస్యలు/రుగ్మతలు పట్టి పీడిస్తున్న సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
కళాశాలల్లో ఈవ్ టీజింగ్లు, ర్యాగింగ్, డ్రగ్ కల్చర్, మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మ హత్యలు చేసుకోవడం, ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి పారిపోవడం, దుర్వవ్యనాలకు బానిసలు కావడం, అమ్మాయిలను ఏడిపించడం, సోషల్ మీడియా, సైబర్ మోసాలు, మొబైల్ ఫోన్లకు బానిసవడం ఆల్కాహాల్, ధూమపానం, పెద్దలను గౌరవించకపోవడం, చట్టాలను, సమాజాన్ని అర్థం చేసుకోకపోవడం, పోర్న్కల్చర్, బ్లూవెల్, మోమో ఛాలెంజ్ వంటి కిల్లింగ్ గేమ్ల బారిన పడడం, ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం, సంఘ విద్రోహక శక్తులుగా మారడం వంటి సమస్యలపై స్థానిక ప్రజలకు పాటలు, నృత్యాల ద్వారా పోలీస్ కళాబృందాలు అవగాహన కల్పిస్తున్నాయని ఆయన కళాబృందం ను అభినందించారు.