ఆటోవర్కర్స్ కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయవద్దని, అలాగే ఏ పార్టీ కూడా హామీ ఇవ్వొద్దని ఆటోవర్కర్స్ యూనియన్స్ జేఏసీ నాయకులు డిమాండ్ చేసారు. జేఏసీ పిలుపు మేరకు ఆటోల బంద్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉచిత బస్సు ప్రయాణం వద్దు, ఆటోవాలాల పొట్ట కొట్టొద్దు వంటి నినాదాలతో కూడిన ప్ల కార్డులు చేతబట్టి కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ (బాక్స్ ప్రసాద్), నల్లం శ్రీను, బట్లంకి ప్రకాష్, తదితరులు నాయకత్వం వహించారు. కోనసీమ జిల్లా ఆటోవర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు, కోశాధికారి మోకా శ్రీను, అమలాపురం ఆటో వర్కర్స్ కన్వీనర్ బొలిశెట్టి శంకరం తదితరులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్బంగా వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ లక్షలాది కుటుంబాలు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఇప్పటికే వివిధ టాక్స్ ల భారంతో ఇబ్బందులతో ఆటో వర్కర్స్ నెట్టుకొస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశ పెడితే ఆటోవర్కర్స్ జీవితాలు అగమ్య గోచరమవుతాయని పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పధకం వలన ఆటోవర్కర్స్ ఉపాధి కోల్పోయి దుర్భర జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. రెండు కోట్ల మంది మహిళల ఓట్ల కోసం ఈ పథకాన్ని ప్రవేశ పెడితే లక్షలాది ఆటోవర్కర్స్ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్వ్యక్తం చేసారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఇలాంటి పథకాలను ఏ ప్రభుత్వం అమలు చేయవద్దని, , ఏ పార్టీ హామీ ఇవ్వొద్దని వారు కోరారు. అనంతరం కోటగుమ్మం వరకు ర్యాలీ సాగింది. వేలాదిమంది ఆటోవర్కర్స్ పాల్గొన్నారు. కాగా స్వచ్ఛంద బంద్ లో వివిధ ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు, రాజమండ్రి అర్బన్, రూరల్ అలాగే పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 15వేల ఆటోలు పాల్గొన్నాయి.