ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన సోదరుడు ఎంపీ అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి అరెస్టయ్యారు. పులివెందులలోని ఆయన నివాసంలో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సీబీఐ అధికారులు ఆదివారం ఉదయమే అధికారులు సీఎం జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితమే అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డిని సీబీఐ ఇప్పటికే 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అనివాష్ రెడ్డి తండ్రిని అరెస్టు చేయడం సర్వత్రా ఉత్కంఠతను రేపుతోంది. మొత్తం రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ అవినాష్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఉదయ్ రెడ్డి విచారణలో భాగంగా అతని ఫోన్లో ఆసక్తికర విషయాలు వెల్లడైనట్లు సీబీఐ రిపోర్ట్లో వెల్లడించారు.
వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఉదయ్కుమార్రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. వెంటనే మాసబ్ట్యాంక్లోని జడ్జి ఇంటి నుంచి ఆయన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. ఎంపీ అవినాష్రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్కుమార్రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి ఈనెల 26 వరకూ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. వివేకానందారెడ్డి హత్యకేసులో ఉదయ్కుమార్ను విచారణ కోసం సీబీఐ కస్టడీ పిటిషన్ వేసింది.
మరోవైపు ఉదయ్కుమార్ తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని మెజిస్ట్రేట్ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. వివేకా హత్య జరగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సీబీఐ సేకరించిన గూగుల్ టేక్ ఔట్ లో ఉదయ్ కుమార్కి సంబంధించిన వివరాలు ఉండడంతో సీబీఐ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. భాస్కరరెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న అభిమానులు, అనుచరులు భాస్కర్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు. సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని వాహనంలో తీసుకెళ్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు.