గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రాజాసింగ్పై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ సతీమణి ఉషాబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కౌంటరు దాఖలు చేశారు.
ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ తరఫు న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. పీడీ చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రవిచందర్ ప్రస్తావించారు. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వాదించారు. ఇప్పటికే ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో 100కు పైగా కేసులు నమోదయ్యాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నిన్న ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్య చేయరాదని షరతు విధించింది.