ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని హిమచల్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు.
ప్రత్యేక హెలిక్యాప్టర్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు ఎంపీ సోయం బాపూరావు , జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ విష్ణు ఎస్.వారియర్లు పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకున్న దత్తన్నకు మేస్రం వంశీయులు, దేవాదాయశాఖ ఆఫీసర్లు ఆదివాసీ సంప్రదాయబద్దంగా తలపాగా చుట్టి స్వాగతం చెప్పారు.
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి దత్తాత్రేయ నాగోబకు ప్రత్యేక పూజలు చేసారు.
అనంతరం ఆయన్ను మేస్రం వంశీయులు శాలువతో సత్కరించడంతో పాటు నాగోబా ఫోటో, ప్రసాదాన్ని అందజేసారు.
కరోనా మహామ్మారీపై విజయం సాధిస్తున్న ఈ తరుణంలో అభివృద్ది మరింత వేగంగా జరుగాలని , రైతులు, మహిళలు, యువకులు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరినట్లుగా ఆయన పేర్కొన్నారు.
1982లో తొలిసారి నాగోబాను దర్శించుకోవడం జరిగిందని తిరిగి ఇన్నాళ్లకు గవర్నర్గా నాగోబాను దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు.
ఆయన వెంట ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఐటీడీఏ పీఓ భవేష్ మిశ్రా తదితరులు ఉన్నారు.