ఆలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆలయాలకు పునర్వైభవాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా యాదాద్రి తరహాలోనే దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు బాసర ప్రధాన ఆలయ పునర్నిర్మాణ ప్రక్రియ జరపాలని కేసీఆర్ దిశానిర్ధేశం మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశానుసారం బాసర ఆలయ బృందం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి వద్దకు వెళ్ళారు.
ప్రధాన ఆలయ అభివృద్ధి, విస్తరణ ప్లాన్ తో పాటు ఆగమ, ఆలయ సంబంధమైన ప్రతిపాదనలను స్వామి ముందుంచారు. ఇప్పుడున్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించడం, సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలా ప్రత్యేక నిర్మాణం, మహంకాళి అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకారం మండంపం, ప్రాకారం లోపల శివాలయ పునః ప్రతిష్ట, దత్తేత్రేయ స్వామివారి స్థల మార్పిడి, నలుదిక్కులా రాజగోపురాలు నిర్మాణం, అనివేటి మండప విస్తరణ, ద్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల ఏర్పాటు వంటి వాటిపై శృంగేరి పీఠాధిపతి పలు మార్పులు, చేర్పులు, సూచనలు చేశారు.
శృంగేరి పీఠం నుంచి తిరిగివచ్చిన ఆలయ బృందంతో గురువారం ఇవాళ శాస్త్రినగర్ లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతి చేసిన మార్పులు, సూచనలను వారు మంత్రికి వివరించారు. శృంగేరి పీఠాధిపతి సూచనలు పాటించాలని, దానికి అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణం ప్లాన్ ను సిద్దం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా క్యూ కాంపెక్స్, కార్యనిర్వహణాధికారి కార్యాలయం, 100 గదుల చౌల్ట్రీ, దాతల సహాయంతో నిర్మించే 50 వసతి గదులు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు. ఆలయ పునర్నిర్మాణం ప్లాన్ తో పాటు మాస్టర్ ప్లాన్ ను సీయం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత, ఆయన ఆదేశాల మేరకు పనులు చేపడతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన వారిలో ఈవో విజయ రామారావు, స్థపతి వల్లి నాయగం, ఎస్ ఈ మల్లికార్జున్ రెడ్డి, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, స్థానాచార్యులు, పూజారులు, తదితరులు ఉన్నారు.