బిసి భవన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఎన్టీఆర్ సర్కిల్, బైపాస్ రోడ్ లో నిర్మిస్తున్న బిసి భవన్ నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రూ. 2 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మిస్తున్న భవనం స్లాబ్ లెవల్ కి చేరుకున్నట్లు, పనుల్లో వేగం పెంచాలని ఆయన అన్నారు. అనంతరం బిసి స్టడీ సర్కిల్ లో ఉద్యోగార్థులకు ఇస్తున్న శిక్షణా తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఉద్యోగార్థులతో వారు ఏ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసింది, కోచింగ్ ఎలా ఉంది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిసి స్టడీ సర్కిల్ ద్వారా 90 మంది నిరుద్యోగ యువతీయువకులకు గ్రూప్-III, IV ఉద్యోగాలకు కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. క్లాసెస్ అన్ని హాజరు కావాలని, వీక్లి పరీక్షలు తప్పక వ్రాయాలని అన్నారు.
చదివిన వాటిని ఏకీకృతం చేసి, సవరించుకుంటే జ్ఞాపకం వుంటాయని, ఉన్నదాంట్లోనే ఉత్తమ ప్రదర్శన చేయాలని అన్నారు. అసలు పరీక్షల లాగా మాక్ పరీక్షలు కూడా క్రమశిక్షణ, అంతే ప్రాముఖ్యత నిచ్చి వ్రాయాలని, అప్పుడే విజయం సులువవుతుందని ఆయన తెలిపారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈవెంట్స్ పై శిక్షణ ఇస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అధికారులు, తదితరులు ఉన్నారు.