అర్హులైన వారిని క్రొత్త ఓటర్లుగా నమోదు వంద శాతం చేపట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తహశీల్దార్లతో ఓటర్ల నమోదు, టీఎం-33 దరఖాస్తుల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఏఇఆర్ఓ ప్రత్యేక ప్రచారానికి బాధ్యునిగా నియమించాలని అన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు, జూనియర్ కళాశాలల్లో ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులందరి నుండి ఓటర్ గా నమోదుకు దరఖాస్తులు స్వీకరించాలని ఆయన తెలిపారు. ఓటర్ నమోదుకు కటాఫ్ తేదీలను జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ లుగా ఉన్నాయని, ఆయా తేదీల్లో 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా నమోదు కావాలని ఆయన అన్నారు.
ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, చైతన్యం తేవాలని కలెక్టర్ తెలిపారు. క్రొత్తగా ప్రతిపాదించిన పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్లు సందర్శించాలని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల పేర్ల మార్పులు ఉంటే చర్యలు తీసుకోవాలని అన్నారు. టీఎం-33 దరఖాస్తుల పెండింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దరఖాస్తుల పరిష్కారం త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. మండల వారిగా పెండింగ్ దరఖాస్తుల సమీక్ష చేసి, తహసీల్దార్ లకు పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవిన్యూ అధికారి శిరీష, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.