గ్రామంలోకి ఎలుగుబంటి ప్రవేశించి ఇద్దరిని గాయపరిచిన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం పూట గ్రామంలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. గ్రామస్తులను చూసి భయాందోళనలకు గురైన ఎలుగుబంటి బాత్రూంలో చొరబడింది.
రెండు మూడు గంటల సమయం తరువాత బాత్రూం నుండి బయటకి వచ్చిన ఎలుగు గ్రామంలోకి వెళ్తుంటే గ్రామస్తులు అటవీప్రాంతం వైపు తరిమెందుకు ప్రయత్నించారు. అదే సమయంలో గ్రామానికి చెందిన దేమే బల్నార్సు, గిద్ద నర్సింలు లను తీవ్రంగా గాయపరచడంతో వారికి చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన సరైన సమయంలో అధికారులు రాకపోవడంతో ఎలుగుబంటి గ్రామస్థుల మీద దాడి చేయడంతో గ్రామస్తులు రాళ్ళు, కర్రలతో ఎలుగుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎలుగుబం టిని బందించెందుకు ఎటువంటి వలలు తీసుకురాలేదనీ గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజ నర్సు మాట్లాడుతూ ఈ రోజు ఉదయం గ్రామస్థులందరూ ఉపాధి హామీ పనికి వెళ్ళిన సమయంలో ఎలుగుబంటి గ్రామంలోకి ప్రవేశించి ఇద్దరిని గాయపరించిందని తెలిపారు.
సమాచారం అందించిన అటవీశాఖ అధికారులు సరైన సమయంలో రాలేదని ఆయన అన్నారు. గ్రామస్థుల మీద దాడి చేసే సమయంలో గ్రామస్తులు ఎలుగు బంటి పై దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు.