బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ విజయవంతంగా జరుగుతున్నది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి బంద్ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసువచ్చి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు.
తక్షణమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరో పక్క రాష్ట్రంలో విశాఖ ఉక్కు , ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని, తక్షణమే ప్రైవేటీకరణ ను నిలుపుదల చేయడానికి ప్రజలు ఏకం కావాలన్నారు. దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పోరాటాలు ద్వారా ముందుకు సాగాలని అన్నారు.
మోడీ పాలనలో మహిళలు, గిరిజనులు, దళితులపై దాడులు పెరిగాయని, ప్రశ్నిస్తున్న వారిని అక్రమంగా నిర్బంధిస్తున్నారన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికుల హక్కులకు రక్షణ కల్పించాలని, ఉపాధి హామీ క్రింద 200 పని దినాలు కల్పించాలని అన్నారు.