ఎమ్మెల్యేలంతా సీఎం కేసీఆర్ తో కొట్లాడి తమ తమ నియోజకవర్గాలకు దళిత బంధు తెచ్చుకుంటుంటే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాత్రం లాలూచీపడి బతుకుతున్నారని ఎంఆర్ పిఎస్ నాయకుడు, రేవంత్ రెడ్డి యువసేన అధ్యక్షుడు దేవన్ కుమార్ మాదిగ అన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో 45 వేల మంది మాదిగలు 15 వేల మంది మాల వాళ్లు ఉన్నారని ఆయన అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో దళితులు ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అసమర్థత వల్ల దళిత బందు అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆరు నెలలు తిరగకముందే ప్రలోభాలకు లొంగిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయిన కొల్లాపూర్ ఎమ్మెల్యే గా బీరం ఉండటం వల్ల నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. అందువల్ల తక్షణమే బీరం తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక వస్తుందని, అలా ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో లాగా కొల్లాపూర్ లో కూడా దళిత బంధు అమలు చేస్తారని ఆయన అన్నారు. తద్వారా కొల్లాపూర్ దళితులు లాభపడతారని, ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇప్పించేందుకు బీరం హర్షవర్ధన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన కోరారు.
దళితులకు పది లక్షలు ఇప్పించిన తర్వాత మళ్లీ ఓట్లేసి ఆయననే గెలిపిస్తామని, పదవి కోసం దిగులు పెట్టుకోవద్దు అని దేవన్ కుమార్ మాదిగ సూచించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా నిర్మించలేదని ఆయన తెలిపారు.
ఏ ఒక్క దళితుడికి కూడా మూడు ఎకరాల పొలం దక్కలేదని, మరి ఈ ఎం ఎల్ ఏ ఎందుకని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగత లాభాల కోసం తప్ప బీరం హర్షవర్ధన్ రెడ్డి దళితుల బాగు కోసం పని చేయడం లేదని ఆయన అన్నారు.