ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పిసిసి డెలిగేట్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి నేడు కమలం గూటికి చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించిన సుభాష్ రెడ్డి చివరి వరకు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తనని కాదని మదన్ మోహన్ రావుకు టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీపై తిరుగుబాటు చేశారు.
ఏకంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తనను నమ్ముకుని వచ్చిన వారికే న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని, టికెట్ ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసారని ఆరోపిస్తూ పిసిసి ప్రధాన కార్యదర్శి, పిసిసి డెలిగేట్, ఎల్లారెడ్డి నియోజకవర్గ కో ఆర్డినేటర్ పదవులకు రాజీనామా చేశారు. సుభాష్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీ జెండాలను దహనం చేశారు. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న సుభాష్ రెడ్డి నేడు బీజేపీలో చేరారు.
బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి
సుభాష్ రెడ్డికి టికెట్ వస్తుందో రాదోనన్న సంశయంలో నెల రోజుల ముందు నుంచే సుభాష్ రెడ్డితో బీజేపీ ముఖ్య నేతలు సంప్రదింపులు జరిపారన్న ప్రచారం సాగింది. టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపులు చేసినా సుభాష్ రెడ్డి మెట్టు దిగలేదు. ఖచ్చితంగా రెబల్ గా బరిలో ఉంటానని స్పష్టం చేయడంతో బుజ్జగింపులు విఫలమయ్యాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా సుభాష్ రెడ్డిని తమ పార్టీలోకి రావాలని ప్రయత్నించాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీకి బలమైన నాయకులు లేకుండా పోవడంతో ఆ పార్టీలో చేరికకు మార్గం సుగమం అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సుభాష్ రెడ్డికి బీజేపీ డబుల్ ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఖరారైందని, రేపు ప్రకటించబోయే బీజేపీ జాబితాలో సుభాష్ రెడ్డి పేరు ఉంటుందని తెలుస్తోంది.
సత్యం న్యూస్, కామారెడ్డి