ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తున్నది. ఇంత కాలం తన గెలుపు ఖాయమని భావించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్క సారిగా 29 వేల కొత్త ఓటర్లను చూసి కంగుతిన్నారు. ఈ 29 వేల మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారో రాజగోపాల్ రెడ్డికి అర్ధం కాలేదు.
దాంతో ఆయన పూర్తి స్థాయిలో తీసుకున్న జాగ్రత్తలన్నీ పనికిరాకుండా పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి క్షేత్ర స్థాయి నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెచ్చుకున్న తర్వాత కూడా ఈ ఉపద్రవం రావడంతో రాజగోపాల్ రెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. టిఆర్ఎస్ పార్టీ 25 వేల నకిలీ ఓటర్లను మునుగోడులో నమోదు చేసిందని ఆయన ఢిల్లీ స్థాయిలో రచ్చ చేస్తున్నారు.
ఢిల్లీలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ , మాజీ శాసనమండలి సభ్యులు రామచందర్ రావు మీడియాతో మాట్లాడిన అంశాలు. ఒక సారి చూద్దాం. గతంలో ఉప ఎన్నికల్లో 2000 ఓట్ల కన్నా ఎక్కువగా నమోదు కాలేదు కానీ ఈ ఉప ఎన్నికల్లో భారీగా నకిలీ ఓటర్లను నమోదు చేశారన్నారు. నకిలీ ఓటర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసామన్నారు. గత నాలుగేళ్ల నుంచి పోలీసులు రెవెన్యూ అధికారులు ఉన్నారు వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.
మంత్రులు సెక్రెటరీలని తీసుకువచ్చి అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. అధికారులు భయపెడుతున్నారన్నారు. తప్పకుండా ఎన్నికల కమిషన్ దీనిపై విచారణ జరుపుతుందని హామీ ఇచ్చారన్నారు. కేంద్ర బలగాలను ,ఎన్నికల పరిశీలకులను మునుగోడు పంపాలని కేంద్రానికి సంఘాన్ని కోరామన్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఈ 29 వేల ఓట్లరు ఎవరు చేర్పించారో వారు ఎవరో తెలిస్తే కానీ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో చెప్పేందుకు వీలులేదు. ఒక వేళ ఈ 29 వేల ఓటర్లను టీఆర్ఎస్ నాయకులే చేర్పించి ఉంటే ఇక వారి గెలుపును ఎవరూ ఆపలేరు.