బీజేపీ నేతలు శాసన సభ సమావేశాల పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర శాసన వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర శాసనసభ ప్రొరోగ్ కాలేదు కనుకే గవర్నర్ ప్రసంగం లేదని ఆయన వివరణ ఇచ్చారు. 1970, 2013 లలో కూడా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా 2004 లో కేంద్ర బడ్జెట్ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించలేదని ఆయన అన్నారు.
ఇలాంటి అంశంపై ఇప్పటి కేంద్ర మంత్రి రాం దాస్ అథవాటే 2010 లో సుప్రీం కోర్టు లో పిటీషన్ వేస్తే ధర్మాసనం కొట్టివేసిందని మంత్రి గుర్తు చేశారు. గవర్నర్ ను ప్రొరోగ్ కానీ సమావేశాలకు పిలిస్తే తప్పవుతుందని, కొందరు తెలివి లేని, జ్ఞానం లేని వాళ్లే గవర్నర్ ప్రసంగం పై వివాదం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. మహిళ అయినందుకే గవర్నర్ ను బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానించలేదని బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి టీ. హరీష్ రావు అన్నారు.
ప్రధాని మోడీ పీఎం కాగానే గుజరాత్ గవర్నర్ కమల బెణి వాల్ ను డిస్మిస్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ ఇటీవలే అందరూ మాతృ మూర్తులను అవమానించారని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళ కాదా.. ఆమెను అక్కడి గవర్నర్ ఎందుకు అవమాన పరుస్తున్నారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. రాజ్ భవన్ కు బీజేపీ వాళ్ళు ఎందుకు కాషాయ రంగు పులుముతున్నారు అని ప్రశ్నించారు. గవర్నర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది బీజేపీ నేతలేనని ఆయన అన్నారు.