విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ప్రారంభమై రెండు వందల రోజులు అయిన సందర్భంగా విశాఖలో 10 కిలోమీటర్ల వరకు 10 వేలమంది కార్మికులు, ఉద్యోగులు మానవహారం చేపట్టారు.
ఇందుకు సంఘీభావంగా విజయనగరం జిల్లా కేంద్రంలో కోట జంక్షన్ నుంచి గంటస్తంభం వరకు ఏఐటీయుసీ, ఐఎన్టియుసీ, సీఐటీయు, ఐ.ఎఫ్.టి.యు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. కార్మిక ప్రదర్శన అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు మొదలి శ్రీనివాస్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్.యు. రవికుమార్, ఐ.ఎఫ్.టి.యు జిల్లా కార్యదర్శి పి మల్లిఖ్ లు మీడియాతో మాట్లాడుతూ 64 గ్రామాల రైతులు భూములు త్యాగం, 36 మంది బలిదానంతో, 5 వేల కోట్ల మూలధనంతో, విశాఖ విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందన్నారు.
విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు ను బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే అన్నారు. విశాఖ ఉక్కు ప్రధాని మోడీ మోడీ జాగీరు కాదని ఎవడు వస్తాడో తేల్చుకుంటామని హెచ్చరించారు. సొంత గనులు కెటాయించని కారణంగానే విశాఖ ఉక్కు నష్టాల్లో పడిందని, కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకొని కార్మికులు ఉద్యోగుల పై బురద జల్లడం తప్పుడు ప్రచారం నిర్వహించడం సరైంది కాదన్నారు.
ఉక్కు ప్రభుత్వరంగం ఆధ్వర్యంలో ఉంది కాబట్టే కరోనా సంక్షోభ సమయంలో ఆక్సిజన్ ను ఉచితంగా సరఫరా చేసిందన్నారు. 2.5 లక్షల కోట్లు విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమను కారుచౌకగా విదేశీ సంస్థ పోస్కో కు అమ్మడమే నా బీజేపీ దేశభక్తి అని ప్రశ్నించారు. నేటికీ 200 రోజులుగా విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకై కార్మికులు, ఉద్యోగులు పోరాడుతుంటే విశాఖ ఉక్కు నే కాదు దేశాన్ని అమ్మకానికి పెడుతున్నామని బిజెపి ప్రకటించడం దాని బరితెగింపు నిదర్శనమన్నారు . విశాఖ ఉక్కును, దేశాన్ని బీజేపీ నుంచి కాపాడుకుంటామనీ నినదించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి.జీవన్, జిల్లా కోశాధికారి ఎస్.రంగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి అప్పలసూరి, నగర అధ్యక్ష కార్యదర్శులు బి రమణ, ఏ జగన్ మోహన్ రావు, ఐఎన్టియుసి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.