బీజేపీ పాలనలో మహిళల పైన నిత్యం దాడులు, లైంగిక వేధింపులు, హింస పెరిగిందని, మణిపూర్ మారణకాండ నుంచి ప్రజల దృష్టిని మరల్చి రానున్న ఎన్నికలలో లబ్ది పొందేందుకు బిజెపి ప్రభుత్వం మహిళల పైన కపట ప్రేమ చూపిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిందని, కాలయాపన చేయకుండా మహిళా రిజర్వేషన్లు 2024 ఎన్నికల్లో అమలు చేయాలని ఐద్వా ఖమ్మం జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ డిమాండ్ చేశారు.
బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో అక్టోబర్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన భారీ నిరసన ర్యాలీలో పాల్గొనటానికి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐద్వా నాయకులు తరలి వెళ్ళారు. ఈ సందర్భంగా మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ మాట్లాడుతూ బిజెపి పాలన నుంచి మహిళలను, దేశాన్ని రక్షించుకోవాలని, మోడీ పాలనలో మహిళల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, బతుకుదెరువు పైన ముందు ఎన్నడు లేని రీతిలో దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యకo చేశారు.