దేశంలో రైతులు పండించే పంటలకు మద్దతుధర ప్రకటించడం, వాటిని సేకరించి, నిల్వ చేసి, కరువు కాటకాలు తలెత్తినప్పుడు కార్మికులు, సై నికులకు పంపిణీ చేయడమే కాకుండా సమాజంలో ఉన్న పేద బడుగు బలహీనవర్గాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరంతరం సరఫరా చేయడం కేంద్రప్రభుత్వ విధి అని వనపర్తి మునిసిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్ చెప్పారు. ఇది 1960 దశకం నుండి కొనసాగుతూ వస్తున్నది.
కేంద్రం ప్రకటించిన మద్దతుధరకు వరి ధాన్యం కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్ సీ ఐ చేస్తుందని, 2015లో ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతా కుమార్ కమిటీ పంటల కొనుగోలు మాత్రమే కాకుండా ఎఫ్ సీ ఐ సంస్థ పంటల ఎగుమతుల మీద కూడా దృష్టిసారించాలని, నిల్వల సామర్ధ్యం పెంచుకోవాలని, పండిన పంటలన్నీ మద్దతుధరకు కొనుగోలు చేయాలని నివేదికలో సూచించిందని చెప్పారు.కానీ కేంద్రం ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం డబల్ గేమ్ ఆడుతోందని, తెలంగాణలో యాసంగి వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి దూడను చీకమని, బర్రెను తన్నమని చెప్పినట్లుందని విమర్శించారు.
తెలంగాణలో ఈ యాసంగి నుండి బాయిల్డ్ రైస్ సేకరణ ఉండబోదని కేంద్రం స్పష్టంగా ప్రకటించిందని, ధాన్యం సేకరణ, వరి సాగు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ గార్లు భిన్న వాదనలతో తెలంగాణ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్నారని చెప్పారు. గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యం నుండి తీసిన బియ్యం ఇక్కడి గోదాముల నుండి తరలించకుండా, ఆ నెపాన్ని తెలంగాణ రాష్ట్రం మీద నెట్టి రైతులను కేంద్రం తప్పుదారి పట్టిస్తున్నదని, ఇంకో వైపు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అసలు వరి సాగు విషయంలో తాము తెలంగాణకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారని తెలిపారు.
బాయిల్డ్ రైస్ సేకరించలేమని ఒకవైపు, వరి సాగు మీద ఆంక్షలు లేవని ఇంకో వైపు ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వంద విధానాలు స్పష్టంగా అర్దమవుతున్నాయని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణలో గత సీజన్ లో సేకరించిన బియ్యం నిల్వలు ఖాళీ చేయకుండా సకాలంలో బియ్యం తరలింపుకు రైల్ ర్యాక్ లు పంపకుండా ఎఫ్ సీ ఐ వేధిస్తున్నదని చెప్పారు. కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ మాట్లాడారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్