గుజరాత్ రాష్ట్ర పర్యాటక అధికారి అజిత్ కుమార్ శర్మ
గుజరాత్ రాష్ట్రం పర్యాటక రంగంలో మరో అడుగు ముందుకు వేసి బోర్డర్ టూరిజాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోషియేషన్ అథ్యక్షుడు కె.విజయ్ మోహన్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో గల రాయల్ పార్క్ హోటల్ లో గుజరాత్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో టూర్స్ అండ్ ట్రావల్స్ ఆపరేటర్లతో సెమినార్ నిర్వహించి పర్యాటకం పై పవర్ ప్రజెంటేషన్ తో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోషియేషన్ అథ్యక్షుడు కె.విజయ్ మోహన్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా విజయ్ మోహన్, గుజరాత్ రాష్ట్ర పర్యాటక అధికారి అజిత్ కుమార్ శర్మ మాట్లాడుతూ పర్యటనల పట్ల ఆసక్తి గలవారికి గుజరాత్ ఒక గొప్ప గమ్యస్థానం అని అన్నారు. ఆధ్యాత్మికం, సాహసం, ఆహ్లాదం, వినోదం ఇలా ఎవరి అభిరుచికి తగ్గట్లుగా తగిన ప్రదేశాలను గుజరాత్ లో అన్వేషించుకోవచ్చునని వివరించారు. పర్యాటక రంగంలో గుజరాత్ రాష్ట్రం సరికొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రత్యేక గుర్తింపును పొందిందని, బోర్డర్ టూరిజంను ప్రారంభించడం ద్వారా మరో అడుగు ముందు కు వేసిందని తెలిపారు.