31.7 C
Hyderabad
May 7, 2024 02: 27 AM
Slider మహబూబ్ నగర్

జర్నలిస్టులు రోడ్డున పడుతున్నారు, పాలకులారా సిగ్గుపడండి

anamchinni

ఉద్యమాల ఖిల్లా అయిన పాలమూరు జిల్లాలో  జర్నలిస్టులు తమ కనీస హక్కులను కాపాడుకునేందుకు బజారుపాలైనారనీ, ఇందుకోసమేనా జర్నలిస్టులు తెగించి తెలంగాణ కోసం కొట్లాడింది? అని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు బజారున పడితే పాలకులు, అధికారులు సిగ్గు పడాలని ఆయన అన్నారు.

11 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం టీడబ్ల్యూజేఏఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలకు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం సంఘీభావం ప్రకటించింది. ఈరోజు టీజేఎస్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. డి ఖాజాపాషా తదితరులు మద్దతు తెలియజేస్తూ దీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ లో జర్నలిస్టులకు పట్టిన దుస్థితి ఇదేనా అని అనంచిన్ని ప్రశ్నించారు.

పని చేస్తున్నప్రతి జర్నలిస్టుకు అక్రిడియేషన్ కార్డు ఇవ్వాలని, అక్రమాలకు తెగబడుతున్న డీపిఆర్వో పాండు రంగారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత11 రోజులుగా దీక్షలు చేస్తుంటే అటు అధికారులు గాని ఇటు ప్రజా ప్రతినిధులు గాని స్పందించక పోవడం విచారకరమన్నారు. ప్రజలు, బాధితులు రోడ్లపై పడి న్యాయం కోసం ధర్నాలు చేస్తే వారికి మద్దతుగా పని చేసిన మీడియానే ఇప్పుడు బజారున పడిందని విచారం వ్యక్తం చేశారు.

 జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డులు ఇవ్వకుండా కొంత మంది ఇతర యునియన్ల నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని, జిల్లాలో ఎంత మంది అనర్హులకు అక్రిడియేషన్ కార్డులు మంజూరు చేశారో తమ వద్ద చిట్టా ఉందని అన్నారు. జర్నలిస్టులు అడిగేది కేవలం అక్రిడియేషన్ గుర్తింపు కార్డులేనని, ఏమైనా అధికార పార్టీ పత్రికలో జర్నలిస్టులు ఏమైనా లాభాల్లో వాటాలు అడుగుతున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

జర్నలిస్టులు కానీ కొంతమంది బ్రాంచ్ మెనేజర్లకు, సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులకు అక్రిడియేషన్ కార్డులు మంజూరు చేశారని, ఈ అవకతవకలు జిల్లా కలెక్టర్, మంత్రి దృష్టికి రాలేదా అని అనంచిన్ని ప్రశ్నించారు. పాలమూరులో జర్నలిస్టుల అక్రిడియేషన్ కార్డులు అమ్ముకున్న, అవకతవకలకు పాల్పడిన వ్యవహారంలో త్వరలోనే సినిమా చూపించడం ఖాయమని అనంచిన్ని హెచ్చరించారు. జోకొట్టే వాళ్లకు, జోకుడు తెలిసిన వాళ్లకు ఎన్ని కార్డులు ఇచ్చారో అవన్నీ బయటకు తీసామని త్వరలోనే హైకోర్టులో న్యాయ విచారణకు సిద్ధం కావాలని అన్నారు.

టీజేఎస్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డి ఖాజాపాషా మాట్లాడుతూ బంగారు తెలంగాణాలో జనాలు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారని కొంతమంది జర్నలిస్ట్ నాయకులు కూడా కళ్ళు తెరవాలని హితవు పలికారు. మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు యం వి రమణ, ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మెట్టు కాడి ప్రభాకర్, అశోక్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ గౌడ్, జిల్లా జాయింట్ సెక్రెటరీలు నరసింహులు, కలిం, వేణు శ్రీనివాసులతో పాటు టీజే ఎస్ఎస్ నేతలు శ్రీధర్ రాజు, శేఖర్ యాదవ్, రమేష్ కన్న, రవి, సందీప్, ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దండకారణ్యంలో కరోనాతో పది మంది మావోల మృతి

Satyam NEWS

ఏలూరు ద్వామా పిడిగా తూతిక శ్రీనివాస విశ్వానాథ్

Satyam NEWS

వచ్చే నెల 17న కొత్త సెక్రటేరియేట్ ప్రారంభం

Bhavani

Leave a Comment