పేద మధ్యతరగతి విద్యార్థులు పట్ల బాధ్యత వహించి ఇంటర్ బోర్డు వారే పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని పిడియస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అంకన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటంలో ఉన్నంత శ్రద్ధ, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించాలన్న శ్రద్ధ శూన్యమాన్నారు.
2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని, మార్కెట్ లో ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను తెలుగు, సంస్కృత అకాడమీ ముద్రించిందని, ఇవి మార్కె ట్లో అందుబాటులో ఉన్నాయని ఉన్న వాటిని కొనుగోలు చేసుకోవాలని ఇంటర్ విద్యా శాఖ ఆదేశాలు జారీ చేయడం సమంజసం కాదన్నారు. మార్కెట్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అకాడమీ పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో కలిపి కొనాలంటే ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల పై 3000 నుండి 5000 రూపాయలు భారం పడుతుందని అన్నారు.
ఇదే అదునుగా భావించి రాయచోటిలో ఉన్న బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వారు ఇష్టానుసారంగా ఎటువంటి రసీదులు ఇవ్వకుండా బుక్స్ ఇస్తున్నారని,తక్షణమే పేద మధ్యతరగతి విద్యార్థుల పట్ల బాధ్యత వహించి ఇంటర్ బోర్డు వారే పాఠ్య పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.నేటికీ ఇంటర్మీడియట్ బోర్డు ఫీజులు నిర్ధారణ చేయకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలలో లక్షల్లో ఫీజుల దోపిడీ,కళాశాలల లోనే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల అమ్మకాలతో వేల రూపాయిల దోపిడి జరుగుతున్న చర్యలు తీసుకోపోవడం దుర్మార్గం అన్నారు.
ప్రయివేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల దెబ్బతీసేందుకే, ప్రభుత్వాలను అప్రతిష్టప్రతిష్ట పాలు చేసేందుకే ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేద మధ్యతరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరుతున్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు లక్కిరెడ్డిపల్లె మండల నాయకులు హేమంత్ కుమార్, కాశీ,నవీన్, వెంకటేష్,భాస్కర్, ప్రకాష్, ఆంజనేయులు, రవి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.