జగన్ ప్రభుత్వం తనను చంపేసేందుకు కుట్రలు చేస్తోందని ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ తో కేఏ పాల్ చేపట్టిన దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన సలహాలు తీసుకుని తమ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని
కేఏ పాల్ విమర్శించారు. జగన్ రాష్ట్ర ప్రజల దృష్టిలో రాజకీయ శత్రువుగా మారుతున్నారని తెలిపారు. “నా వద్దకు డాక్టర్లను పంపించవద్దు.. నేను కేజీహెచు వెళ్లను.. నన్ను చంపేసినా సరే, ఇక్కడే దీక్ష చేస్తా” అని కేఏ పాల్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం తనకు బీపీ, షుగర్ లెవెల్ బానే ఉన్నాయన్నారు. “నేను గతంలో ఎన్నోసార్లు ఉపవాస దీక్షలు చేశాను. నా గురించి ఏమీ భయపడక్కర్లేదు. నాకేం కాదు. కానీ, పరీక్షలు వాయిదా వేయండి.. నేనే మీ ఇంటికి వచ్చి కలుస్తాను” అని సీఎం జగన్కు కేఏ పాల్ కోరారు.