ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి శాప్ చైర్మన్ బైరెడ్డి శిద్దారెడ్డి వ్యవహారం శిరోభారంగా మారింది. రానున్న ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తనకు ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు కేటాయించాలని బైరెడ్డి.. సీఎం జగన్ ను కోరడం కర్నూలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కర్నూలు రాజకీయాలలో బైరెడ్డి శిద్దారెడ్డికి ప్రత్యేక స్థానం వుంది. బైరెడ్డి ఎమ్మెల్యే కాక పోయినా నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్థర్ ను కాదని శిద్దారెడ్డి డిఫాక్టోగా వ్యవరిస్తున్నాడు. బైరెడ్డి చర్యలకు విసిగిగిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్డర్ రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పాడు. ఈ వ్యవహారం సీఎంకు తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇదిలా వుండగా రానున్న ఎన్నికల్లో మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గం.. ఈ నాలుగింటిలో ఎక్కడో ఒకచోట పోటీకి దింపుతున్నట్లు ప్రకటిస్తే సరే లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని బైరెడ్డి.. సీఎం కు తేల్చిచెప్పినట్లు సమాచారం.
ఇది సీఎం కు మింగుడు పడని అంశంగా మారింది. రానున్న ఎన్నికల్లో కర్నూలు సిటీ, పాణ్యం, శ్రీశైలం ఈ మూడింటిలో ఏదో ఒకచోట టికెట్ ఇవ్వాలని.. కుదరని పక్షంలో నంద్యాల ఎంపీ సీటు అయినా సరే ఇవ్వాలని.. ఇవేవీ ఇవ్వని పక్షంలో కీలక నిర్ణయమే తీసుకోవాల్సి వస్తుందని నేరుగా జగన్కు తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి చట్టసభల్లోకి అడుగుపెట్టాలని ఈసారి గట్టిగానే బైరెడ్డి నిర్ణయం తీసుకున్నారట. అయితే బైరెడ్డి కోరిన ఆ నాలుగు నియోజక వర్గాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కర్నూలు సిటీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రానున్న ఎన్నికల్లో కూడా ఇక్కడ్నుంచే పోటీచేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు.. ఇదే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరిలో ఎవర్నో తేల్చలేకపోతున్న జగన్కు ఇప్పుడు బైరెడ్డి కూడా ఒకరు తోడు అయితే పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకమే. శ్రీశైలం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు.
శిల్పా ఫ్యామిలీకి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత వున్న శిల్పా ఫ్యామిలీని కాదని బైరెడ్డికి టికెట్ ఇస్తే.. ఈ ఫ్యామిలీ మరుక్షణం టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. ఇదే జరిగితే.. శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని రామ్భూపాల్ రెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఫ్యామిలీకి కాటసాని కుటుంబానికి గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచే అన్నదమ్ములిద్దరూ ప్రస్తుతం పాణ్యం (రామ్ భూపాల్ రెడ్డి), బనగానపల్లె (కాటసాని రామిరెడ్డి) ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని టచ్ చేసినా రెండు సీట్లు గల్లంతు అని చెబుతున్నారు.
ఇవి కాకపోతే నంద్యాల పార్లమెంట్ స్థానం సిట్టింగ్ ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డికి రాయలసీమలో ఆయనకున్న అంగబలం, ఆర్థిక బలాన్ని చూసి జగన్ ఏరికోరి ఎంపీ టికెట్ ఇచ్చారు. .పైగా ఈసారి పోచా వద్దనుకుంటే మాత్రం ఇక్కడ్నుంచి పోటీచేయడానికి మాజీ ఎంపీ బుట్టా రేణుక రంగం సిద్ధం చేసుకున్నట్లు వర్గాల సమాచారం. ఈ ఇద్దర్నీ కాదని.. బైరెడ్డికి సీటిచ్చే పరిస్థితి మాత్రం కనిపించట్లేదని వైసీపీ వర్గాల వినికిడి.
బైరెడ్డి పోటీ చేయాలనే నాలుగు నియోజకవర్గాల్లో ఏ ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చినా గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఈ సారి ఎదురుదెబ్బ తప్పదని భావిస్తున్నారు. దీంతో బైరెడ్డి రూపంలో జగన్కు పెద్ద చిక్కే వచ్చిపడిందట. ఈ పరిస్థితుల్లో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారు..? జగన్ నిర్ణయం తర్వాత బైరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది..? అంది మిలియన్ డాలర్ల ప్రశ్న యూత్లో మంచి క్రేజ్ ఉన్న బైరెడ్డికి టికెట్ అన్నది జగన్కు అతి పెద్ద టాస్కేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.