బ్రహ్మం సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ.గోవింద రెడ్డి కూడా పాల్గొన్నారు.
మొత్తం లక్ష ఎకరాలకు ఈ సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. బ్రహ్మంగారి మఠం తెలుగు గంగ గెస్ట్ హౌస్లో కడప ఎంపీ వైఎస్ ఆవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాదికి తెలుగుగంగ ఆయకట్టుకు నీరు అందిస్తామని తెలిపారు.
గత పదేళ్ల లో ఎన్నడూ లేని విధంగా వెలుగోడులోకి నీరు చేరగానే తెలుగు గంగకు నీరు తెచ్చామని ఆయన తెలిపారు. ఎన్నికల హామీ మేరకు కుందూ నది నుంచి బ్రహ్మగారి మఠంకు ఎత్తి పోతల పథకం పై ప్రభుత్వం ముందుకెళుతోందని ఎంపి తెలిపారు.
వచ్చే జూన్ నాటికి నీరు తీసుకువచ్చి 25 వేల ఆయాకట్టును స్థిరీకరణ చేస్తామని ఆయన అన్నారు. అదే విధంగా తెలుగుగంగలో 17 టీఎంసీల మేర నీటిని నింపేందుకు 12 టీఎంసీ వద్ద ఫాల్ట్ జోన్ పై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు.
అదే విధంగా కడప జిల్లా అట్లూరు, గోపవరం మండలాలకు తెలుగుగంగ నీరు అందించేందుకు బద్వేలు చెరువుకు నీరందించే లోయర్ సాగిలేరు కాలువను 700ల క్యూసెక్కుల సామర్ధ్యంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీనిపై త్వరలో సీఎం ను కలిసి నివేదిస్తామని ఎంపి తెలిపారు.
అలాగే తెలుగు గంగ కుడి, ఎడమ కాల్వల సరఫరా వ్యవస్థలను పూర్తి చేస్తామని, మూడేళ్ళలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ఆయన అన్నారు.