బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుందని వైఎస్ఆర్టిపి కామారెడ్డి అసెంబ్లి ఇంచార్జి నీలం రమేష్ అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదని, మళ్లీ కొత్త కథ మొదలు పెట్టిండన్నారు. బ్రతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక భీమా ఇస్తాడట అని ఎద్దేవా చేశారు. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొర.. ప్రతి మహిళకు నెలకు 3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు. నిరుద్యోగ భృతి అని గత మ్యానిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కులేదు కానీ ఇప్పుడు 3 వేలు ఇస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. విడతల వారీగా పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్ అని అభివర్ణించారు. రుణమాఫీ పై దొర గారి యూ టర్న్ తీసుకున్నారన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేక కేసీఆర్ ఏనాడో చేతులెత్తేశారన్నారు. ఉన్న పథకాలను పాతర పెట్టి ఓట్ల కోసం కొత్త పథకాలు అంటూ డ్రామాలు తప్ప మరోటి లేదన్నారు. బందిపోట్లు సమితి మేనిఫెస్టో ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు.
previous post