ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై బీఆర్ఎస్ సంబరాల్లో మునిగితేలింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి, మహిళలు బతుకమ్మ ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. కనీవినీ ఎరుగని రీతిలో బీద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. గత 2018 లో విడుదల చేసిన మేనిఫెస్టో 100 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు.
గత మేనిఫెస్టోలో లేని అనేక పథకాలు అమలు చేశామన్నారు. ప్రస్తుతం పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. గ్యాస్ ధరలు 400 పెంపు, విడతల వారిగా పింఛన్ల పెంపు, రైతుబంధు పెంపు, ఆరోగ్యశ్రీ 15 లక్షలకు పెంచడం ఎవరు ఉహించలేనిదన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా అందించడం జరుగుతుందని సీఎం చెప్పారన్నారు.
కామారెడ్డి నియోజకవర్గం తరపున పేదల కోసం అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, గైని శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు బాను ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.