కరోనా సమయం అని కూడా చూడకుండా లక్షలాది రూపాయలతో పేకాట ఆడే పెద్దలను కొల్లాపూర్ పోలీసులు పట్టుకున్నారు. కొల్లాపూర్ సిఐ బి.వెంకట్ రెడ్డికి పక్కా సమాచారం రావడంతో ఆయన ఒక ప్రణాళిక ప్రకారం తన సిబ్బందితో దాడి చేయించారు.
పెద్దకొత్తపల్లి మండల పోలీస్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ విజయవంతం చేసేందుకు కొల్లాపూర్ ఎస్ ఐ కొంపల్లి మురళిని పంపారు. పోలీసు బృందం పకడ్బందిగా దాడి చేయడంతో 12 మంది పేకాట రాయుళ్లు దొరికిపోయారు. వీరంతా పెద్దకొత్తపల్లి మండల కేంద్రం సమీపంలోని యాపట్ల గ్రామంలో పేకాట ఆడుతున్నారు.
12 మందిని అరెస్టు చేయడమే కాకుండా వారి నుంచి రూ.1,29,970 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 12 మంది బడాబాబుల నుంచి నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా నాలుగు ద్విచక్ర వాహనాలు, 14 సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.