ప్రతి పేద కుటుంబానికి నెలకి 7,500 రూపాయల చొప్పున ఆరు నెలల పాటు ప్రతి వ్యక్తికి పది కేజీల సన్నబియ్యం ఇవ్వాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షులు శీతల రోషపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద కాలువ వద్ద జంగాల గూడెంలో రైతు సి ఐ టి యు వ్యవసాయ కార్మిక సంఘం దశలవారీ పోరాటంలో భాగంగా సర్వే చేసిన సందర్భంగా శీతల రోషపతి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ జీవనం చేస్తున్నా వీరికి ఇంతవరకు ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవటం అన్యాయమని, తక్షణమే వీరికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు.
కరోనా వల్ల వీర జీవన పరిస్థితి చెల్లాచెదురైందని, ఉపాధి హామీ పథకం మున్సిపల్ పరిధిలో పెట్టాలని, రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని , దీంతోపాటు ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ కార్మిక చట్టాల సవరణ పనిగంటలు సవరణ నిలుపుదల చేయాలని, ఏకకాలంలో రైతులకు ఋణ మాఫీ చేయాలని కోరారు.
ప్రతి గ్రామపంచాయతీ సర్పంచ్ కి మున్సిపల్ చైర్మన్ కి ఈ నెల 31న వినతి పత్రాలు ఇవ్వాలని ఆగస్టు 9న జైలుభరో కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎలక సోమయ్య గౌడ్ ,గంజాయ్ బాలు, కాంతయ్య అంజి, శ్రీను ,లక్ష్మీ ,నాగయ్య, గోవిందమ్మ, తదితరులు పాల్గొన్నారు.