బీజేపీని కాదని బీహార్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తేజస్వి యాదవ్ కు సీబీఐ రూపంలో కష్టాలు దాపురించాయి. ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో IRCTC కుంభకోణం జరిగింది. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. కుంభకోణం కేసులో లాలూ యాదవ్ కుటుంబానికి చెందిన పలువురు నిందితులుగా ఉన్నారు. వీరిలో తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు.
ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో IRCTC కుంభకోణం మళ్లీ వెలుగులోకి తెచ్చారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులను బెదిరించినందున యాదవ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తేజస్వి యాదవ్ మీడియా సమావేశంలో సీబీఐ అధికారులను బెదిరించారని, అందుకే ఆయన బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ కోరింది. సీబీఐ దరఖాస్తుపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ తేజస్వి యాదవ్కు నోటీసు జారీ చేసి సమాధానం ఇవ్వాలని కోరారు. ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ను రద్దు చేస్తే బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.