పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశి యాత్రకు వచ్చిన అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలను ఒక గెస్ట్ హౌస్ యజమాని రికార్డు చేస్తుండగా పట్టుకున్నారు. వారణాసి పరేడ్ కోఠి లోని కాంట్ స్టేషన్ ఎదుట ఉన్న జేపీ గెస్ట్ హౌస్ లో ఈ అకృత్యం జరిగింది. పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులను చేరదీసి పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ చదివిస్తుంటుంది.
ఈ సంస్థ 20 మంది విద్యార్థులను కాశీ పర్యటనకు తీసుకొచ్చింది. పరేడ్ కోఠిలోని జేపీ గెస్ట్ హౌస్లో వీరు బస చేశారు. శనివారం బాలికలు, మహిళలు దుస్తులు మార్చుకుంటుండగా అనుమానం వచ్చి గెస్టు హౌస్ లో చూడగా అక్కడ వారికి సీసీ టీవీలు కనిపించాయి. తాము దుస్తులు మార్చుకుంటుండగా ఆ దృశ్యాలను రికార్డు చేస్తున్నారని కనుక్కున్న వారు ఆందోళనతో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో చెప్పారు.
వెంటనే స్వచ్ఛంద సంస్థ వారు వెళ్లి అడిగితే గెస్ట్ హౌస్ వారు తమ గెస్టు హౌస్ లో సీసీ కెమెరాలు ఉన్నమాట వాస్తవమేనని అయితే అవి స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని చెప్పారు. కేవలం గెస్ట్ హౌస్ భద్రత కోసం మాత్రమే వాటిని ఏర్పాటు చేసుకున్నామని కూడా చెప్పారు.
అయితే సీసీ టీవీ ఫుటేజి చూడాల్సిందేనని వారు పట్టుపట్టగా గెస్టు హౌస్ యజమానులు నిరాకరించారు. దాంతో వారు సిగ్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏసీపీ చెట్గంజ్ వికాస్ శ్రీవాస్తవ, సిగ్రా ఇన్స్పెక్టర్ రాజు సింగ్ గెస్ట్ హౌస్ చేరుకున్నారు. గెస్ట్ హౌస్లోని డీవీఆర్ను స్వాధీనం చేసుకుని, లేడీ కానిస్టేబుల్ తో సోదాలు చేయగా, ఆరోపణలు నిజమేనని తేలింది.
స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు మేరకు గెస్ట్ హౌస్ యజమాని ప్రదీప్ యాదవ్, మేనేజర్ రాజ్కుమార్లపై వేధింపులతోపాటు ఇతర ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ చెట్గంజ్ వికాస్ శ్రీవాస్తవ తెలిపారు. సిగ్రా ఇన్స్పెక్టర్ రాజు సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థినుల ఆరోపణలపై మహిళా కానిస్టేబుల్ విచారణ చేపట్టారు. కొందరు విద్యార్థినులు బట్టలు మార్చుకుంటున్న వీడియో రికార్డు అయి ఉన్నది.
అయితే గేటును పర్యవేక్షించేందుకు కెమెరాను అమర్చినట్లు గెస్ట్ హౌస్ మేనేజర్ తెలిపారు. గెస్ట్ హౌస్ గురించి మరింత సమాచారం సేకరిస్తున్నారు. సిగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గెస్టు హౌస్, పేయింగ్ గెస్ట్ హౌస్, పరేడ్ కోఠిలోని మరొక లాడ్జి, ఇంగ్లీషియా లైన్లో కూడా అనైతిక వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా గెస్ట్ హౌస్లో వేధింపులు, అత్యాచారాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.