ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఫోన్లో వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వసనీయత పై ఉద్యోగుల ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలని కోరారు. రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాలని, నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలన్నారు. లక్షల ఉద్యోగుల సమస్య పై అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని ప్రభుత్వం చేసిన మోసం పై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా? ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా? రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని ప్రశ్నించారు.
రాజకీయ పక్ష నేతల పై పెట్టినట్లు ఉద్యోగుల పై గృహ నిర్భంధాలు సిఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి అని అన్నారు. పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భంధించడం, విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేనని ఆయన అన్నారు. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.
ఉద్యోగులను అగౌరపరిచే…ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలని ఆయన కోరారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, కానీ జగన్ సర్కార్ ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు చూడలేదు అన్నారు.
ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు,వెన్న బలకోటి రెడ్డి,రావెల లక్ష్మీ నారాయణ,వాసిరెడ్డి రవి,పీటర్ రాజు,గొట్టిపాటి జనార్దన్ బాబు,మాజేటి వెంకటేష్,మన్నన్ షరీఫ్,సైదవాలి,చల్లా సుబ్బారావు,కోనేటి శ్రీనివాస్ రావు, మందలపు వెంకట్ రత్నం,గడ్డం కరిముల్లా,కొల్లి వెంకటేశ్వర్లు, బడే బాబు,మబు,పెరికాల రాయప్ప,యంపరాల ఖాసీం,సంజీవ్ రావు,కదం నాగజ్యోతి, కనుమూరి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.