అప్పులపై జగన్ సర్కారును కేంద్రం మరోసారి హెచ్చరించింది. కార్పొరేషన్లు చేస్తున్న అప్పులను కూడా రాష్ట్రం చేసే అప్పులుగానే చూపించాలని తేల్చి చెప్పింది.
పెండింగ్ బిల్లులనూ రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని తెలిపింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్తోపాటు పలు సంస్థల ద్వారా ఏపీ సర్కారు అప్పులు తెస్తోంది. వాటికి సంబంధించిన వడ్డీలు, వాయిదాలను ఖజానా నుంచి చెల్లిస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఏపీ సహా మరికొన్ని రాష్ర్టాలు కార్పొరేషన్ల అప్పులను (ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్) ఖజానా ద్వారానే చెల్లిస్తున్నాయని, అందుకే కొన్ని రాష్ర్టాల్లో ఉద్యోగులకు జీతాలకు, పెన్షన్లకు, కార్యాలయాల నిర్వహణకు నిధులు ఉండటం లేదని అభిప్రాయపడ్డారు.
ఏపీ పబ్లిక్ డెట్ ప్రస్తుతం రూ.4.13 లక్షల కోట్లు. కార్పొరేషన్ల అప్పులు రూ.2 లక్షల కోట్లు. పెండింగ్ బిల్లులు దాదాపు రూ.1.5 లక్షల కోట్లు. ఇవి కాకుండా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా, ఇతర శాఖలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్ల నుంచి తీసుకున్న డిపాజిట్లు దాదాపు రూ.10,000 కోట్ల లెక్క కూడా చూపించాలి. ఇవన్నీ కలిపితే ఏపీ అప్పులు రూ.7.73 లక్షల కోట్లకు చేరుకుంటాయి.
అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. తిరిగి చెల్లించాల్సింది మాత్రం కార్పొరేషన్లే! కానీ… రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా అప్పుతెచ్చుకుని, తన అవసరాలకు వాడుకుని, ఆ తర్వాత ఖజానా నుంచే చెల్లింపులు చేస్తోంది.
దీనికి ‘గ్రాంటు’ అనే పేరు పెట్టినప్పటికీ… ఆ మొత్తాన్ని అప్పులు, వడ్డీలు చెల్లింపులకు వాడుతున్నారు. ఈ లెక్కలు బడ్జెట్లో కూడా సరిగా చూపడంలేదంటూ 15వ ఆర్థిక సంఘం చెప్పిందని గతంలోనే కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు దీనిపై హెచ్చరికలు జారీ చేశారు.