రాష్ట్రంలో సీయం కేసీఆర్ చొరవతో నాటి పోరాట యోధులకు సముచిత గౌరవం దక్కుతున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ 128 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అన్నారు. పీడిత ప్రజల కోసం ఎనలేని పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అని, ఆమె త్యాగం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. అలాంటి వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఐలమ్మ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో రజకుల కృషి ఎనలేనిదని, వారి వృత్తి గౌరవ ప్రదమైనదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
రజకుల సంక్షేమ కోసం కోట్లాది రూపాయాలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. రజకులకు ధోబీఘాట్లే కాకుండా లాండ్రీ దుకాణాలు, నాయీబ్రహ్మణులకు క్షౌర శాలలకు ఉచిత కరెంట్ అందజేస్తున్నామని వివరించారు. అంతకుముందు మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.