తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఆయన కాన్వాయ్ పై దాడి చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడి నివాసంపై మంత్రి జోగి రమేష్ దాడికి వస్తే చర్యలు తీసుకోకపోగా ఆయన మంత్రి పదవితో ప్రమోషన్ ఇచ్చారని ఆయన అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి చేసిన వారిపై ఈ రోజుకీ చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ వారిని బూతులు తిట్టకపోతే ఏకంగా మంత్రివర్గం నుంచి తొలగిస్తానని కేబినెట్ లో ప్రకటించే స్థాయికి జగన్ రెడ్డి దిగజారిపోయారని, అందుకనే ఈ రోజు జగన్ కు ఇష్టమైన నీచమైన బాషను మంత్రులు వాడుతున్నారు…రాళ్లతోనూ కొడుతున్నారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. యధా రాజా..తదా ప్రజా..అన్న చందానా జగన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. జగన్ రెడ్డి తీరుతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకున్నాయని, సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకుడి వరకు ఎవరికీ రక్షణ లేదని ఆయన తెలిపారు.