అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బంగారం పెద్ద ఎత్తున తమిళనాడు పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. మొత్తం 1381 కేజీల బంగారం రోడ్డు మార్గంలో వస్తుండగా తిరువళ్లూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు.
ఆ తర్వాత ఆ బంగారానికి సంబంధించిన వివరాలు ఇవ్వడంతో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ బంగారం అంతా చెన్నై పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన బంగారమని, గడువు ముగియడంతో తీసుకువస్తున్నామని అప్పటిలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
ఈ సంఘటనపై పలు రకాల ఆరోపణలు వచ్చాయి. పోలీసులు పట్టుకోకపోయి ఉంటే ఆ బంగారం ఏమై ఉండేదని అప్పటిలో చాలా మంది ప్రశ్నించారు. ఈ సంఘటనపై విచారణ జరపాలని విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర కూడా కోరారు.
వైసీపీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
అనుమానాలు నివృత్తి చేసేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం అప్పటి రెవెన్యూ సెక్రటరీ మన్మోహన్ కమిటీని నియమించారు. మన్మోహన్ కమిటీ వారం రోజుల్లోనే అంశాన్ని పూర్తిగా పరిశీలించి ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించి ఎల్ వి సుబ్రహ్మణ్యం తదుపరి చర్యలకు ఉపక్రమించారు.
అయితే లోపు ఎన్నికలు పూర్తి కావడంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా కూడా ఇప్పటి వరకూ మన్మోహన్ కమిటీ నివేదికను బహిర్గత పరచడం కానీ చర్యలు తీసుకోవడం కానీ చేయలేదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.
మన్మోహన్ కమిటీ నివేదికను వెల్లడి చేయాలని అప్పటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం కు తాము వినతిపత్రం సమర్పించామని ఆయన తెలిపారు. ఆ నివేదికను నేటి ప్రభుత్వం, ధర్మకర్తల మండలి తక్షణమే బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మన్మోహన్ కమిటీ నివేదిక వెలికి వస్తే బంగారం రవాణాలో టీటీడీ అధికారుల నిర్లక్షమా లేక బ్యాంక్ అధికారుల బాధ్యతారాహిత్యమా అన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. నివేదిక వెల్లడి కాకపోతే శ్రీవారి బంగారం రవాణాలో అనుమానాలు భక్తులలో అలానే ఉండిపోతాయని ఆయన అన్నారు.