ఆంధ్రప్రదేశ్ లో వున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
1974 ఏపీ జిల్లాల విభజన చట్టం ప్రకారం జిల్లాల విభజన అధికారం రాష్ట్రాలకు ఉంటుంది కానీ దేశవ్యాప్తంగా జనగణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే రాష్ట్రాలలో జిల్లాల,నియోజకవర్గాల విభజన జరగాలి అంటూ 2020లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల విభజన ప్రక్రియను నిలుపుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన “ఫ్రిజింగ్ ఆర్డర్” అమలులో ఉండగా జిల్లాల విభజన గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
“కోడలు మగబిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా” అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ ను అమలు చేస్తారా? లేక రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ, ఉద్యోగస్తుల, మంత్రుల వ్యక్తిగత దూషణలు,వివిధ ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా? అన్నది పక్కన పెడితే తిరుపతి వాసిగా జిల్లాల విభజన గెజిట్ ను స్వాగతిస్తున్నామని అయితే బాలాజీ జిల్లా కన్నా “తిరుపతి జిల్లా” అన్న పేరు సరైనదని ఆయన అన్నారు.
బాలాజీ అనే పదం ఉత్తర భారతీయులు వాడతారు
బాలాజీ అనే పదం ఎక్కువగా ఉత్తర భారత దేశానికి సంబంధించిన ప్రజల వాడుక భాష అయినందున “తిరుపతి జిల్లా” గా ప్రకటించడం ఎంతో చరిత్ర కలిగిన తిరుపతి అనే పదానికి సార్థకత ఉంటుందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
“తిరుపతి జిల్లాలో” తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి,పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు చంద్రగిరిలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి నారాయణవనం నాగలాపురం లాంటి ఎంతో చరిత్ర కలిగిన టీటీడీ దేవాలయాలన్నీ తిరుపతి జిల్లా పరిధి లోకి రావడం దైవానుగ్రహం! తిరుపతి (PC) పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని తిరుపతి చంద్రగిరి కాళహస్తి సత్యవేడు వెంకటగిరి గూడూరు సూళ్లూరుపేట నియోజకవర్గాలని కలుపుతూ “తిరుపతి జిల్లా” గా ప్రకటించడంతో తూర్పు ప్రాంతాలలోని 7 నియోజకవర్గాల ప్రజలకు తిరుపతి జిల్లా ” సెంటర్ పాయింట్ ” గా ఉంటూ విద్యాపరంగా, వైద్యపరంగా,వాణిజ్యపరంగా, ఉద్యోగపరంగా,ఆర్థికపరంగా, ఆధ్యాత్మికపరంగా,శాంతి భద్రతల పరిరక్షణ ఇలా అన్నీ విధాల శ్రేయస్కరమని ఆయన అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఐఏఎస్,ఐపీఎస్,ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు రావడం తద్వారా తిరుపతి జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల అభివృద్ధికి “ప్రత్యేక నిధులు” కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు,పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటాయి,పరిశ్రమల స్థాపనకు అనుమతులు త్వరితగతిన వచ్చే అవకాశాలు ఉండడంతో పెట్టుబడిదారులు”క్యూ” కడతారని ఆయన అన్నారు.
“శ్రీ సిటీ” తిరుపతి జిల్లాకు ఆదాయ వనరులను పెంచే “అక్షయ పాత్ర”
“శ్రీ సిటీ” తిరుపతి జిల్లాకు ఆదాయ వనరులను పెంచే “అక్షయ పాత్ర” లాంటిది సత్యవేడు రైతులు ఇచ్చిన వందలాది ఎకరాల భూమిలలో ఏర్పాటు చేసిన (SEZ) “శ్రీ సిటీ” లోని పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయం అంతా తిరుపతి జిల్లాకే చెందుతుంది అలాగే “తిరుపతి జిల్లా” పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలలో ప్రాధాన్యత లభిస్తుందని ఆయన తెలిపారు.
“శ్రీ సిటీ” లోని కొంత భాగం గతంలో చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలుపుతో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే “రద్దు” చేసి తిరుపతి జిల్లా పరిధిలోకి కలుపుతూ కొత్త జీవో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జిల్లాల విభజన కంటితుడుపు చర్యగా కాకుండా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా “తిరుపతి జిల్లా” గా ప్రకటించాలని తిరుపతి స్థానికుడిగా,కాంగ్రెస్ పార్టీ తరఫున రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ గా డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు.