నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి పలువురిని మోసం చేసిన ముఠాను అరెస్ట్ చేసినట్లు నల్లగొండ వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ తెలిపారు.
నలుగురు వ్యక్తుల ఈ ముఠా మాయ మాటలు చెప్పి పలువురు నిరుద్యోగుల నుండి ఇప్పటి వరకు సుమారు 20 లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పారు.
ఖమ్మం జిల్లా సారపాకకు చెందిన లక్కు శ్రీకాంత్ రెడ్డి, నల్లగొండకు చెందిన మేడేబోయిన వెంకన్న, మెదక్ జిల్లా సంగాయిపేటకు చెందిన వంగాల వెంకట్రామిరెడ్డి, హైదరాబాద్ కు చెందిన మోహన్ లతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు.
నల్లగొండకు చెందిన లింగస్వామి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని లోతుగా విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుల వద్ద నుండి 3.40 లక్షల రూపాయల నగదు, ఒక టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగిందని వీరందరిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ తెలిపారు.
అభినందించిన డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి
కేసు విచారణలో ఎస్.ఐ. నర్సింహారావు, వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ తదితరులు సమర్థవంతంగా పనిచేసి నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా పని చేసిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ రాజు, రాము, ఇతర సిబ్బందిని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నిరుద్యోగులు ఇలాంటి వ్యక్తుల మాయ మాటలకు మోసపోవద్దని, ఇలా ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.