చీమలపాడు ఘటన లో మృతుల కుటుంబాలను, తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటుందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. చీమలపాడు ఘటనలో మృతి చెందిన అజ్మీరా మంగు, బాణోత్ రమేష్, ధరంసోత్ లక్ష్మణ్, సందీప్ కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన అయిదుగురు కుటుంబాలకు రెండున్నర లక్షలు చొప్పున ఖమ్మం కలెక్టరేట్ లో ఆర్థిక సాయం చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ చీమలపాడు ఘటన తమ కళ్ళ ముందే జరగడం వల్ల చలించిపోయామని చెప్పారు. ఘటన దురదృష్ట. కరమన్నారు.తీవ్రంగా గాయపడిన వారికి నిమ్స్ లో తాను దగ్గరుండి వైద్యం చేయించానని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబాలను ముందుగా చెప్పినట్లు గడువు లోపే అదుకున్నారని , సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. మృతి చెందిన నలుగురు కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున తాను సొంతంగా అందించడం జరిగిందని తెలిపారు.
బాధితుల పిల్లలకు విద్య విషయంలోను ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేసీఆర్ గొప్ప మానవతా విలువలు ఉన్న నాయకుడు కాబట్టే ఇంత తొందరగా బాధితులను అన్ని విధాలా అదుకున్నారని అన్నారు.అందరం కలిసి బాధితులకు న్యాయం చేయడం జరిగిందని తెలిపారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఎంపీ నామ నాగేశ్వరరావు,ఎమ్మెల్యే రాములు నాయక్ చొరవతో బాధితులను సకాలంలో అదుకున్నామని చెప్పారు.
ఎంపీ నామ సొంతగా కూడా బాధితులకు ఆర్థిక సాయం చేయడం తో పాటు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. కలెక్టర్ గౌతమ్ కూడా ఎంపీ నామ నాగేశ్వరరావు సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో చీమలపాడు ఘటన మృతులు, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలు, జిల్లా కలెక్టర్ గౌతమ్, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు,సింగరేణి ఎంపిపి శకుంతల, చీమలపాడు సర్పంచ్ కిషోర్, జేసీ,ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.