సరిహద్దులో యుద్ధ కాంక్షతో తహతహలాడుతున్న చైనా మరోవైపు ప్రపంచ మీడియాపై పట్టు కోసం ప్రయత్నిస్తుంది. చైనాలో ట్విటర్ను అధికారంగా బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. గ్లోబల్ టైమ్స్, జిన్హువా వంటి అధికారిక వార్తా సంస్థలు ఎవరి కోసం ట్విటర్లో ట్వీట్లు చేస్తున్నాయన్న సందేహం అంతర్జాతీయ అంశాల విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగిలిన దేశాల మీడియాల్లో ఎటువంటి వార్త రావాలనుకుంటే .. వాటికి సంబంధించిన అంశాలను చైనా వార్తా సంస్థలు ట్వీట్ చేస్తాయన్నమాట. ఈ రకంగా ఆయా దేశాల్లో ప్రజల అభిప్రాయాలను తనకు అనుగుణంగా మార్చుకుంటోంది డ్రాగన్ కంట్రీ. పశ్చిమ దేశాల ఆదిపత్యాన్ని అడ్డుకోవడానికి మీడియాను చైనా ఓ పదునైన ఆయుధంగా ఎంచుకొంది.
ఇప్పటి వరకు ఈ రంగంలో ఆయా దేశాల హవా కొనసాగింది. తొలినాళ్లలో చైనా ఈ రంగంపై పెద్దగా వెచ్చించలేదు. చైనీయుల కోసం వార్తలను సెన్సార్ చేయడం.. విదేశీ పత్రికల జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించడంపైనే దృష్టిపెట్టింది. కానీ, చైనా ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో ప్రపంచ దేశాల్లో పాగా వేస్తోంది.
వార్తల రూపంలో ప్రజాభిప్రాయాన్ని చైనాకు అనుకూలంగా ప్రభావితం చేయడం దానికి చాలా కీలకంగా మారింది. దాదాపు పదేళ్ల క్రితం నుంచి డ్రాగన్ కూడా మీడియా ద్వారా ఆయా దేశాల ప్రజల అభిప్రాయాలను చైనాకు అనుకూలంగా మార్చేందుకు యత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచ మీడియాపై పట్టు సాధించేందుకు 2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు దాదాపు పది బిలియన్ డాలర్లను చైనా ఖర్చు చేసింది.
ఓవైపు భారత్ సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలు.. ఇంకోవైపు అంతర్జాతీయ మీడియాపై పట్టు సాధించేందుకు భారీ పెట్టుబడులు.. ఇలా డ్రాగన్ కంట్రీ మనదేశానికి సవాళ్ళు విసురుతూనే వుంది. భారత సరిహద్దు దేశాలను మచ్చిక చేసుకునే కుటిలయత్నాలు ఇందుకు అదనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ అంతర్జాతీయ వ్యూహాలను పునర్లిఖించుకోవాల్సిన అవసరం వుందని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.