ఖమ్మం పట్టణంలో 45 సంవత్సరాల పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అవినీతికి ఎటువంటి అవకాశం లేకుండా పరిపాలించి ప్రజల మన్ననలు పొందిన నేత చిర్రవూరి లక్ష్మి నర్సయ్య అని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం లో చిర్రవూరి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళి అర్పించారు.
ఆయన వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈనాడు కాలంలో పదవులు రాగానే కొద్ది మంది నాయకులు దర్పం ప్రదర్శిస్తున్నారని, కానీ 45 సంవత్సరాల పాటు ఖమ్మం పట్టణానికి మున్సిపల్ చైర్మన్ చిర్రవూరి లక్ష్మి నర్సయ్య పని చేసినా ఆయన జీవితం సామాన్య వ్యక్తి లెక్క పరిపాలన చేసి చూపించారని తెలిపారు.
ఖమ్మం పట్టణం రోజు రోజుకు పెరుగుతున్న కాలంలో ఆనాడే రహదారులు, డ్రైనేజీ, వాటర్ ట్యాంక్ లు కట్టి చాలా ముందుచూపుతో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక సౌకర్యాలు చిర్రవూరి ఖమ్మం పట్టణంలో ఆనాడే కల్పించారని తెలిపారు. భవిష్యత్తు కాలాన్ని దృష్టి లో ఉంచుకొని నిజాయితీగా పరిపాలన కొనసాగించి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలించిన యోధుడు చిర్రవూరి అని తెలిపారు.
ఈనాడు ప్రజా ప్రతినిధులుగా అవకాశం వస్తే దోచుకోవడం, దాచుకోవడం చూస్తున్నారు అని కానీ సంవత్సరాల తరబడి ప్రజా ప్రతినిధి గా చిర్రవూరి వున్నా ఆయనకు ఎటువంటి మచ్చ లేదు అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో సంవత్సరాల తరబడి జైల్లో శిక్ష అనుభవించారని తెలిపారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడంలో ఆయన పోరాటాలు గొప్పవి అని కొనియాడారు.