మూడు రాజధానులపై ప్రజల మద్దతు కూడగట్టడానికి అధికార వైసీపీ కొత్త ఎత్తుగడ వేస్తున్నది. అందులో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఒక లేఖ పంపారు. మూడు రాజధానులకు తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతున్నదని అందువల్లే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
విశాఖపట్నంలో తక్షణమే ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సాధారణంగా ఏ ఎమ్మెల్యే అయినా ఎంపి అయినా కండిషనల్ రిజిగ్నేషన్ (ఏదైనా సాకు చెప్పి రాజీనామా లేఖ) పంపితే దాన్ని స్పీకర్ ఆమోదించే అవకాశం ఉండదు. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటే దానికి ప్రత్యేకంగా స్పీకర్ ఫార్మేట్ ఉంటుంది. కేవలం ఒకే ఒక వాక్యం లేదా రెండు వాక్యాలతో రాజీనామా లేఖ ఫార్మేట్ ఉంటుంది.
అలా రాజీనామా లేఖను స్పీకర్ కు అందచేసినా లేదా ప్రత్యేక వాహకుడి ద్వారా పంపినా అది అందుకున్న స్పీకర్ సదరు ఎమ్మెల్యేను పిలిచి ఆ లేఖ కరెక్టేనా అని వ్యక్తిగతంగా విచారణ చేసి రాజీనామాను ఆమోదించాలనుకుంటే ఆమోదిస్తారు. అలా కాకుండా లేఖ లోనే కండిషన్ పెడితే ఆ లేఖను స్పీకర్ పరిగణనలోకి తీసుకునే అవకాశమే ఉండదు.