పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. సూర్యగ్రహణం 25వ తేదీ సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే దాదాపు 1:15 నిమిషాల పాటు గ్రహణం భారతదేశంతోపాటు ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం, ఆసియాలోని నైరుతి భాగం, అట్లాంటిక్లో కూడా కనిపిస్తుంది. యాదాద్రి ఆలయాన్ని 25వ తేదీ ఉదయం 8:50 నుంచి 26వ తేదీ ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. ఆలయంలో జరిగే నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. బుధవారం నిర్వహించాల్సిన శత ఘటాభిషేకం, సహస్ర నామార్చన, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. 26 వ తేదీ ఉదయం 10:30 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ఏడుపాయల శ్రీ వన దుర్గాభవానీ మాత ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. 25వ తేదీ ఉదయం 8:50 నిమిషాలకు మూసివేసి తిరిగి 26వ తేదీ ఉదయం 9:30 కు తెరచి నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. భద్రాద్రి రామాలయo, వేములవాడలో రాజన్న ఆలయo , జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మూసివేసారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం తిరుమంజనం నిర్వహించి, భక్తులకు సర్వ దర్శనానికి అనుమతిస్తారు.
ధర్మపురి ఆలయాన్ని నిత్యారాధన, నివేదన అనంతరం మూసివేశారు. అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కూడా మూసివేసారు. ఆలయంలో నిర్వహించాల్సిన చండీ హోమాన్ని రద్దు చేశారు. వరంగల్లో భద్రకాళి అమ్మవారి, హనుమకొండలో వేయి స్తంభాల గుడిని మూసివేశారు. గ్రహణం అనంతరం సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. తిరుమలలో శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. వీజయవాడ కనకదుర్గమ్మ ఆలయ తలుపులు మూసివేశారు. బుధవారం దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించి, ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం ఆలయంలో అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. విశాఖ సింహాచలం, శ్రీకాకుళం అరసవల్లిa ఆలయాలను కూడా మూసివేశారు.